సూర్యాపేట: రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి ఆరోపించారు. బుధవారం ఐద్వా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వారిధ్య భవన్ సెంటర్ లో నిత్యవసర వస్తువుల ధరలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై ధరలబారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని మూలంగా మహిళలు సరైన పోషక ఆహారా పదార్థాలు తీసుకోకపోవడంతో రక్తహీనతతో బాధపడుతున్నారని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 16 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని కోరారు. పౌష్టిక ఆహారం లేకపోవడం మూలంగా పిల్లలలో ఎదుగుదల లోపం ఉందన్నారు. దేశంలో చిన్నారుల ఎదుగుదల రేటు35.5 శాతంగా ఉందన్నారు. ఐదు సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో2.9 శాతం మంది మృత్యువాత పడుతున్నారని అన్నారు. ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో సంపద కొద్దిమంది చేతుల్లో కీ పోతుందని అన్నారు. మూడు పూటలు భోజనం తినని కుటుంబాలు దేశంలో లక్షలాదిగా ఉన్నాయన్నారు. అనేకమంది వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెట్ కు సరుకులను తరలిస్తున్నారని వాటిని వెలికి తీసి పేదలందరికీ పంచాలని కోరారు. పాలకులు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా మహిళలపై, విద్యార్థులపై, యువతి లపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు గోరంగా వైఫల్యం చెందుతున్నాయని విమర్శించారు. అనేక చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై జరుగుతున్న దాడులు హింస తగ్గడం లేదని చట్టాలను సమర్థవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు మేకన పోయిన సైదమ్మ, పిండిగా నాగమణి, చిత్రం భద్రమ్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.