సూర్యాపేట:నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దళిత, రజక కుటుంబాలను అడ్డుకోవడంతోపాటు పసి పాపను తొక్కి చంపిన పెత్తందారులను హత్య నేరం కింద వెంటనే అరెస్టు చేయాలని , బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, పెత్తందారులకు కొమ్ము కాసిన ఎస్ఐ, సీఐ ఇతర పోలీసులను తక్షణమే విధుల నుండి తొలగించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
జాతరలో దర్శనం టికెట్ కు రసీదు ఇవ్వాలని అడిగినందుకు పెత్తందారులు దాడి చేసి కొట్టడమే కాకుండా పసిపాపను కాలితో తొక్కి చంపిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి వారిపై హత్య నేరం కేసు నమోదు చేయాలని అన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును పక్కనపెట్టి పెత్తందారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధితులపై రివర్స్ కేసు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు పెత్తందారులకు కొమ్ము కాయడం బాధాకరమన్నారు. పోలీసులందరినీ విధుల నుండి తక్షణమే తప్పించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంత ఎంపీ మల్లురవి ఇప్పటివరకు నోరు చెప్పకపోవడం అనేక అనుమానాలకు కారామవుతుందన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు చూసుకొని గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఘటనలకు పెత్తందారులు పాల్పడుతున్నారని, బాధితులతో ఎవరూ మాట్లాడొద్దని బెదిరించడం, బాధితులకు శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇంటిని నిలుపుదల చేయడం వంటి చర్యలు ఆందోళన సమంజసం కాదన్నారు. తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని బాధితులకు అండగా ప్రభుత్వం నిలబడాలని, లేని పక్షంలో సామాజిక సంఘాలను ఇతర ప్రజాసంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని హెచ్చరించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
