ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి డిమాండ్ చేశారు. స్థానిక లాల్ బంగ్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో డి రవి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వారి మేనిఫెస్టోలో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు అండదండగా ఉంటామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలలు గడుస్తున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయకపోవడం దేనికి నిదర్శనం అని వారు ప్రశ్నించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల గురించి చూసి చూడనట్లు వివరించడం మూలంగా విద్యార్థులు యువకులు కలిసి టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు నేడు అదే విధానాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విద్యార్థి యువకులు కలిసి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. విద్యార్థులకు రావాల్సినటువంటి 8200 కోట్ల రూపాయలను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల ఉద్యమాల మూలంగా దసరా, దీపావళి సందర్భంగా కొత్త బడ్జెట్ విడుదల చేస్తామని చెప్పి యాజమాన్యాలను మభ్యపెట్టిన ప్రభుత్వం నేటి వరకు ఒక రూపాయి కూడా విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహించటం అంటే విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రేమ ఉందో అర్ధం అవుతుందని వారన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యా సంస్థలు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) పూర్తి మద్దతు తెలియజేసి ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
