హైదరాబాద్, మార్చి 23 : మహిళలే ప్రగతికి మూలాధారం అని జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ అన్నారు. రవీంద్రభారతి మినీహాల్లో జీవనది ఫౌండేషన్ మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా పవిత్ర జీవ నదుల పుష్కర పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో పలు రంగాలలో ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు పురస్కారాలతో ముఖ్య అధితిలు లయన్ విజయరంగ, అలనాటి టి.వి.యాంకర్ విజయదుర్గ సత్కరించారు. తొలుత శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి చిత్ర పటానికి పూల మాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన మహేశ్వరి తాను స్వయంగా రచించిన గీతాన్ని ఆలపించారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా బుడితి కోటేశ్వరరావు ప్రసంగించారు. కర్నూలుకు చెందిన సంకల్ప దీక్ష పరుడు సపారె గోవిందరాజ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటి లక్ష్మీ దుర్గ చేస్తున్న సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ, టివి నటి రాగిణీ మాట్లాడుతూ నీటిని అందరూ పొదుపుగా వాడాలన్నారు. ప్రతి నీటి బొట్టు కూడా చాలా ముఖ్యమని, ప్రతీ నీటిబొట్టు రేపటి తరానికి చాలా అవసరమన్నారు. నీటిని ప్రతీ ఒక్కరూ చాలా జాగ్రత్తగా వినియోగించాలని తెలిపారు. కార్యక్రమానికి ప్రవీణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మరో అతిథిగా పాల్గొన్న గిడుగు రామ్మూర్తి పంతులు మనవరాలు కాంతి కృష్ణ మాట్లాడుతూ లక్ష్మీ దుర్గ చేస్తున్న సేవలను కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ, నదుల శుభ్రత గురించి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆమె కోరారు. ప్రతీ ఒక్కరూ లక్ష్మీ దుర్గ చేస్తున్న సేవలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం జీవనది ఫౌండేషన్ సభ్యులకు అతిధుల చేతుల మీదుగా సన్మానం చేసి, జ్ఞాపికలను అందజేశారు. ఒక దివ్యాంగ మహిళకు జీవనది ఫౌండేషన్ తరపున వీల్ చైర్ బహుకరించారు. అనంతరం పురస్కార గ్రహీతలకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్ , కిరణ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కిరణ్, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు బెల్లం మాదవి, జీవనది కుటుంబసభ్యులు హేమలత రెడ్డి, రఘు ప్రియ, కవిత, సంధ్య, అర్చన మరియు జీవనది ఫౌండేషన్ సభ్యులు, జాతీయ మీడియా కో-ఆర్డినేటర్ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర తదితరులు పాల్గొన్నారు.
