సూర్యాపేట: డివైఎఫ్ఐ ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు, తాడువాయి సింగిల్ విండో మాజీ చైర్మన్ మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామానికి చెందిన బొంత శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బొంత శ్రీనివాస్ రెడ్డి 18వ వర్ధంతిని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొంత శ్రీనివాస్ రెడ్డి డివైఎఫ్ఐ కోదాడ డివిజన్ అధ్యక్షుడిగా, మునగాల మండలం తాడువాయి గ్రామ సింగిల్ విండో చైర్మన్ గా పనిచేస్తూ నిరుద్యోగ యువతీ, యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాంతంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న బొంత శ్రీనివాస్ రెడ్డిని కసాయి కాంగ్రెస్ గుండాలు అతి దారుణంగా హత్య చేశాయని అన్నారు. హత్యల ద్వారా ప్రజా ఉద్యమాలను, ప్రజా పోరాటాలను ఆపలేరని అన్నారు. కమ్యూనిస్టులపై దాడులకు పాల్పడిన ఏ ప్రభుత్వము బ్రతికి బట్ట కట్ట లేదన్నారు. కమ్యూనిస్టుల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. పేదలకు కూలి పెరిగిన, రైతులకు గిట్టుబాటు ధర వచ్చిన, కార్మికులకు వేతనాలు పెరిగిన, దళితులకు ఆత్మగౌరవం వచ్చిందన్న, వృత్తిదారులకు హక్కులు వచ్చాయంటే అది ఎర్ర జెండా ద్వారానే సాధ్యమైందన్నారు. కష్టజీవుల హక్కుల కోసం కడవరకు పనిచేసేది కమ్యూనిస్టులేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు మరో పోరాటాన్ని నిర్మిస్తామని అన్నారు. నేటి యువత బొంత శ్రీనివాస్ రెడ్డి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జె. నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, మేకన బోయిన శేఖర్, నాయకులు పంతంగి గోపయ్య పాల్గొన్నారు.
