బడ్జెట్ ప్రకటన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షత టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రజలకు మంచి బడ్జెట్ అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ కు రూపకల్పన చేశామని అన్నారు. గత వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారని తెలిపారు. ఈ బడ్జెట్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, వచ్చే ఎన్నికల్లో కూడా టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని తేల్చి చెప్పారు. మళ్లీ అసెంబ్లీకి రావాలి అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడా విభేదాలకు తావు లేదని, గ్రూపులు కడితే సహించేది లేదని హెచ్చరించారు.
