విజయవాడ : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు మొదలెట్టింది. తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్కార్డులు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి సంక్రాంతి సమయంలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని, సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే వివిధ కారణాలతో ఆ దిశగా అడుగులు పడలేదు. తాజాగా కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్త రేషన్ కార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మార్చి నెల నుంచి రాష్ట్రంలో క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అలాగే రేషన్ కార్డులలో మార్పులకు, చేర్పులకూ అవకాశం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లోనూ ఈ ప్రక్రియ మొదలు అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.