పిఠాపురం, (బి.చిన్నబ్బాయి) ఫిబ్రవరి 07 : పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9,10,11 తేదీలలో 98వ జ్ఞాన చైతన్య వార్షిక మహా సభలను నిర్వహించనున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. శనివారం పిఠాపురం రైల్వే ఫ్లై ఓవర్ సమీపంలోని పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మాట్లాడుతూ ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రం ద్వారా సృష్టిని సమాజాన్ని దర్శించగలిగితే మానవ జన్మకు పరిపూర్ణత లభిస్తుందని పేర్కొన్నారు. కాలాన్ని సద్వినియోగపరచుకొని ఆధ్యాత్మిక భావనతో మహాసభల్లో పాల్గొని ఫలాలు, ఫలితాలు పొందాలని తెలిపారు. జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద, వయో బేధాలకు అతీతంగా, అర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో, సర్వమత సమ్మాతమైన ఈశ్వర ఏకత్వ ప్రత్తిపాదనతో కూడిన తాత్విక జ్ఞానం ఈ ఈ జ్ఞాన చైతన్య మహా సభలయందు ఉపదేశించబడుతుందని వెల్లడించారు. తదుపరి పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు మాట్లాడుతూ 1472వ సంవత్సరంలో స్థాపించబడి మాతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుతున్న 554 సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర గల పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 9,10,11 తేదీలలో పిఠాపురంలోని రైల్వే ఫ్లై ఓవర్ సమీపంలో ఉన్న నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అధ్యక్షతన ఈ సభలు అత్యంత వైభవంగా నిర్వహించ బడతాయని తెలిపారు. దేశ విదేశాల నుండి సుమారు 50 వేల మంది సభ్యులు ఈ సభలకు హాజరవుతారని వెల్లడించారు. 3 రోజులపాటు జరిగే ఈ ఈ మహాసభల్లో ఆశ్రమ ప్రాంగణంలో పీఠం విశిష్టతను తెలియపరిచే 36 స్టాల్స్ఏర్పాటు చేసామని అన్నారు. సుమారు 900 మంది వాలంటీర్లు ఆశ్రమం వద్ద సేవలు అందిస్తారని పేర్కొన్నారు. నూతన ఆశ్రమం నుండి పూర్వ ఆశ్రమానికి, పూర్వ ఆశ్రమం నుండి నూతన ఆశ్రమానికి ఉచిత బస్ మరియు ఆటో సౌకర్యం కూడా కల్పించిన్నట్లు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్ సౌకర్యం కల్పించామన్నారు. సభల్లో పాల్గొనే వారందరికీ ఉచిత భోజనం, ఉచిత హోమియో, అల్లోపతి వైద్య సౌకర్యం అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్స్, సాహితీ వేత్తలు, రాజకీయ ప్రముఖులు, పుర ప్రముఖులు ఈ కార్యక్రమాలకు హాజరువుతారని వెల్లడించారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన అనంతరం విశ్వ ప్రార్ధనతో సభ ప్రారంభం అవుతుందని అన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు నూతనంగా మహా మంత్రం పొందాలనే అభిలాష కలవారికి, పీఠాధిపతి ఉమర్ అలీషా మహా మంత్రోపదేశం చేస్తారని తెలిపారు. ఫిబ్రవరి 9,10 తేదీలలో సాయంత్రం 4 నుండి 6 వరకూ తాత్విక యువ వికాస్ కార్యక్రమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 8 వరకూ సాoస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మధుసూదనరావు, అశోక్, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ,డాక్టర్ పింగళి ఆనందకుమార్, భాస్కర్ అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు.
previous post
