పిఠాపురం, మార్చి 24 : భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం కాకినాడ కలెక్టరేట్కు భారీగా తరలి వెళ్లి కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. “సింహ గర్జన” వేదికగా పార్టీ ప్రతిపాదించిన ఐదు కీలక డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో పిఠాపురం బీసీవై పార్టీ కన్వీనర్ శీరం శ్రీను మాట్లాడుతూ బీసీ హక్కుల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయకూడదని, వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. బీసీ రక్షణ చట్టం తక్షణ అమలు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన నిధుల విడుదల, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుల గణన నిర్వహణ, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు మరియు చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించడం వంటి ఈ ఐదు డిమాండ్లను అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. అలాగే పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ నాయకత్వంలో ఏప్రిల్ 11వ తేదీన విజయవాడలో ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కన్వీనర్ రాయుడు నాగేశ్వర్, పిఠాపురం కన్వీనర్ శీరం శ్రీను, ప్రత్తిపాడు కన్వీనర్ గొంప శివకుమార్, పిఎసి ఏపి రాయుడు సుధాకర్, కాకినాడ టౌన్ యువ నాయకుడు పాలేపు గణేష్, శాంతి, దేవి, గింజలా రాజా, కురందాసు రమేష్, కుండల శ్రీను, గోర్ల శివాజీ, కొల్లుబోయేనా గణేష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
