- ఫ్లెక్సీలు, జెండాలు కూడా తొలగిస్తాము
- సభా వేదిక నుంచి యువత, రైతు, మహిళ ప్రతినిధులకు మాట్లాడే అవకాశం
- కాకినాడ కంట్రోల్ రూంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
కాకినాడ : పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా మార్చి 14వ తేదీన జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా నభూతో న భవిష్యత్తు అన్న రీతిలో సభను నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మొదలయ్యే ఈ సభ దాదాపు ఐదు గంటలపాటు సాగుతుందని చెప్పారు. మన భాష, యాస, సంస్కృతిని ప్రతిబింబించేలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశామన్నారు. సభ పర్యవేక్షణ కోసం కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సోమవారం మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు ఏపీ, తెలంగాణ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. వారికి ఎటువంటి ఇక్కట్లు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా తిరుగు ప్రయాణంలో భోజనానికి ఇబ్బంది కలకుండా ముఖ్యమైన నాలుగు రహదారుల్లో భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
- యువతకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలో యువతకు మాట్లాడే అవకాశం కల్పించాలని తమ పార్టీ అధ్యక్షు డు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అదే విధంగా రైతు, మహిళ ప్రతినిధులు మాట్లాడతారన్నారు. కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై తమ పార్టీ నాయకులు మాట్లాడతారన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, అభివృద్ధి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తారు.
- పారిశుధ్యం కోసం ప్రత్యేక కమిటీ
సభ పూర్తయిన అనంతరం పరిసరాలను శుభ్రం చేయడానికి ప్రత్యేక కమిటీ నియమించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగం ఇది. ఈ మేరకు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 25 మంది స్థానిక నాయకులతో కమిటీని నియమించాం. ఈ కమిటీ సభ ముగిసిన అనంతరం సభాప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులు పర్యవేక్షిస్తుంది. తమ పార్టీ జెండాలు, ప్లెక్సీలే కాకుండా ఇతర పార్టీల జెండాలు కిందపడినా వాటిని జాగ్రత్తగా తొలగిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి ఆలోచన భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు చేయలేదు. తమ పార్టీ మూల సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే మూల సిద్ధాంతం ఉంది. దానిని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముందుకు తీసుకెళ్తాం.
- తోపుడు బండ్ల వారికి ఉపాధి కల్పించేలా వినూత్న ప్రయత్నం
వాతావరణంలో మార్పులు కనబడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని సభకు తరలివచ్చే కార్యకర్తల కోసం మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నాం. వీటితో పాటు పుచ్చకాయ ముక్కలు ఉచితంగా అందిచేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు. కార్యకర్తలకు ఎండ నుంచి ఉపశమనం కలింగించే విధంగా ఉచితంగా పుచ్చకాయ ముక్కలు అందించే విధంగా ప్రణాళిక రచిస్తున్నామన్నారు. ఇందుకు కాకినాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే తోపుడు బండ్ల వారితో మాట్లాడుతున్నామన్నారు. వారికి అందుకయ్యే మొత్తాన్ని పార్టీ చెల్లిస్తుందన్నారు.
- 75 సీసీ కెమెరాలతో నిఘా
ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరవుతున్నందును ఆయన భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పోలీస్ డిపార్టుమెంట్ తీసుకుంటుంది. పార్టీ పరంగా మేము కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం 75 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. బందోబస్తు విషయంలో ఎక్కడ పొరపాట్లు జరగకుండా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నా మన్నారు. ఎస్వీ.ఎస్.ఎన్.వర్మ చాలా సీనియర్ నాయకులు, కూటమి భాగస్వామి పక్షంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన కష్టపడ్డారు. జనసేన పార్టీ తరఫున వర్మకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అయితే పదవులు అనేవి వాళ్ల పార్టీ అంతర్గత విషయమన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్, శాసనసభ్యులు పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస రావు, మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు.