సంగారెడ్డి జిల్లా మంజీర నది శివారు గ్రామాలైన అల్మాయిపేట, అందోలు గ్రామాల ఒడ్డుకు మొసళ్లు సేద తీరడానికి రావడం కలకలం రేపింది. దీంతో మత్స్యకారులు, రైతులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అందోలు మండలం పరిధిలోని అల్మాయిపేట, చందంపేట గ్రామాల మద్యన గల మంజీర నది వద్ద ఉన్న బండరాయిపై పెద్ద సైజులో ఉన్న మొసలి సేద తీరడాన్ని అందోలు–జోగిపేట మత్స్సకారుల సహకార సంఘం అధ్యక్షుడు నాగరాజు వీడియో, ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాడు. మొసళ్ల ప్రత్యక్షంపై సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండు రోజుల క్రితం అందోలు శివారులోని శ్రీనివాస్రెడ్డి పొలం సమీపంలో రెండు మొసళ్లు ప్రత్యక్షమయ్యాయి. వీటిని కూడా మత్స్యకారులే చూసి స్థానికులకు తెలియజేశారు. ఈ విషయమై పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా తమకు ఎలాంటి సమాచారం లేదని వారు తెలిపారు. ఏది ఏమైనప్పటికిని అందోలు, అల్మాయిపేట శివారు ప్రాంతంలోని మంజీర నీటి ఏరియాలోకి వెళ్లే మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా మంజీర నదిలోకి నీరు వదిలినప్పుడు మొసళ్లు వరదలో ఇటువైపు కొట్టుకు రావచ్చునని స్థానికులు భావిస్తున్నారు.