బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్స్ పేదల కొరకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని డి ఎం హెచ్ ఓ కోటాచలంతో కలిసి ఆమె సందర్శించి మాట్లాడారు. పేదలు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఖర్చులు భరించలేని వారికి అత్యాధునిక సౌకర్యాలతో కోదాడలో మొబైల్ వాహనం ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ ఆరోగ్య సేవలు అందించడం సంతోషకరంగా ఉందన్నారు. అనంతరం పరీక్షల గురించి అక్కడ ఉన్న డాక్టర్లను సాంకేతిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మన శరీరంలో జరిగే మార్పులను గమనించుకుంటూ తరచూ డాక్టర్లను సంప్రదించి పరీక్షలు చేపించుకోవాలన్నారు. కాగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రంలో 300 మంది వరకు క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నట్లు డిఎంహెచ్వో కోటా చలం తెలిపారు. ఈ కార్యక్రమంలోపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, డిసిహెచ్ఎస్ వెంకటేశ్వర్లు,హాస్పిటల్ సూపర్డెంట్ దశరథ, డిప్యూటీ డిఎంహెచ్వో జయ మనోరి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ ఆదిత్య, డాక్టర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు……….
