మంగళగిరి : పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య కన్నుమూశారని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చింతించానన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా నని తెలిపారు. వృక్షో రక్షతి రక్షితః అనే పెద్దల మాటలోని వాస్తవాన్ని ప్రజలకు తెలియచేసేందుకు రామయ్య పడ్డ తపన సమాజానికి ఎంతో మేలు చేస్తోందన్నారు. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటుతూ, విత్తనాలు జల్లుతూ పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వన యజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్చమైన పర్యావరణాన్ని అందిస్తుంది. రామయ్యకి ఓ సందర్భంలో ప్రమాదం చోటు చేసుకొంటే ఆసుపత్రిలో ఉండగా పరామర్శించానని, అప్పుడు కూడా పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడారన్నారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, పచ్చదనం పెంపునకు కృషి చేయడంతోపాటు… పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తామన్నారు. ‘వనజీవి’ రామయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
