విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో లిక్విడ్ స్టీల్ను తరలిస్తున్న సమయంలో ల్యాడల్ నుంచి హాట్మెటల్ బకెట్లు కుప్పకూలడంతో ప్రమాదం సంభవించింది. మరుగుతున్న స్టీల్ కార్మికులపై పడటంతో 9 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు సమాచారం. ఇప్పటివరకు నలుగురు మృతదేహాలను గుర్తించిన అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
లిక్విడ్ స్టీల్ ద్వారా బీమ్స్ తయారు చేసే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కార్మికులు తెలిపారు. ప్రమాద సమయంలో సుమారు 150 టన్నుల లిక్విడ్ స్టీల్ ఉన్నట్లు సమాచారం. లాడల్ బ్లాస్ట్ కావడం ఇదే తొలిసారి అని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఘటనాస్థలిలో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
