మోతే: అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. మంగళవారం మోతే మండల కేంద్రంలో జరిగిన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజలు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వెంటనే వేగవంతం చేసి ఇల్లు లేని పేదలకు ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకు అతీతంగా చేయాలన్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. నియోజకవర్గానికి 3500 ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారని అవి ఏ మూలకు సరిపోవు అన్నారు. నియోజకవర్గానికి పదివేల ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇండ్ల నిర్మాణం పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల కు నేటికీ బిల్లులు రాలేదని ప్రభుత్వం వెంటనే వాటికి కూడా బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని ప్రజలు ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం తక్షణమే భూమి కొనుగోలు చేసి ఇంటి స్థలం లేని పేదలకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని వెంటనే అమలు చేయాలని కోరారు. రేషన్ కార్డులు లేక గత పది సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ప్రకటనకు మాత్రమే పరిమితమైంది తప్ప సంవత్సర కాలంగా ఒక్కరికి కూడా రేషన్ కార్డు మంజూరు చేసిన పాపాన పోలేదు అన్నారు. తక్షణమే అర్హులందరికీ రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ, కాంపాటి శ్రీను, చర్లపల్లి మల్లయ్య, సోమ గాని మల్లయ్య, బానోతు లచ్చిరాం, దోసపాటి శ్రీను, జంపాల స్వరాజ్యం, బి. వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.