- హైదరాబాద్, జూలై 05 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్ (ఉదార్ట్) డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఆదివారం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ శాఖ సభ్యులు ఘట్టుపల్లిలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో 200 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ ఉమర్ ఆలీషా పాల్గొని మొక్కలు నాటడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఒక మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. వాటి ద్వారా చక్కని ఆక్సీజన్ లభిస్తుందన్నారు. నేటి ఆధునిక సమాజంలో వాహనాల వాడకం ఎక్కువవ్వడం వల్ల కాలుష్య ప్రభావంతో పర్యావరణం దెబ్బతింటుందన్నారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ హైదరాబాద్ శాఖ సభ్యులు, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం హైదరాబాద్ ఆశ్రమ సభ్యులు పాల్గొన్నారు.
