ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రవ్యాప్తంగా 2,601 రైతు వేదికల్లో జూన్ 23 నుండి 30 వరకు నిర్వహణ
• ఒకే వేదికపై రైతులకు నాణ్యమైన విత్తనాలు
• ఎంపిక చేసిన ఏడు రకాల వరిసన్నరకాలు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల,కూరగాయ విత్తనాలు రైతులకు అందుబాటులో
• నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో
• ఎల్నినో పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై అవగాహన, విత్తనలభ్యత
• ధ్రువీకరించిన విత్తనాల అమ్మకాలతో అధిక దిగుబడుల సాధన
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో పప్పు జాతి పంటలను, నూనె గింజ పంటలను, చిరుధాన్యాలు. కూరగాయ పంటల సాగును రైతులను ప్రోత్సహించే దిశగా రైతులకు ఆయా పంటలకు సరైన విత్తనాలను, నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై అందుబాటులో ఉంచుటకు ప్రభుత్వం ఈకార్యక్రమాన్ని రూపొందించారు
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికలలో ఈనెల 23వ తేదీ నుండి 30 తేదీ వరకు విత్తన మేళాలు నిర్వహించనుంది
రైతులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ పంటల ధ్రువీకరించిన విత్తనాలను సరసమైన ధరలకు కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులకు నాణ్యమైన విత్తనాలే అందేలా వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది.
విత్తన మేళాల్లో పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్య పంటల విత్తనాలతో పాటు నువ్వులు, వేరుశెనగ వంటి నూనె గింజల పంటల విత్తనాలు, వివిధ రకాల చిరుధాన్యాలు, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయి.
అలాగే సమగ్ర పోషక యాజమాన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక ఎరువులను కూడా రైతుల కొనుగోలుకు అందుబాటులో ఉంచుతున్నారు.
రైతుల అభిరుచులు, మార్కెట్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048 (తెలంగాణ సోనా), జైశ్రీరామ్, కేఎన్ఎం–1638, కేఎన్ఎం –7715, డబ్ల్యూజీఎల్–44, హెచ్ఎంటీ సోనా వంటి సన్న రకాల విత్తనాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.
విత్తన మేళాల సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ, శాస్త్రవేత్తలు రైతులకు విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, సమగ్ర పంట యాజమాన్యం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, చీడపీడల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
అంతేకాకుండా ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పంటల ఎంపికపై కూడా రైతులకు మార్గదర్శకాలు అందించనున్నారు.
విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకొని నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేసి శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి, ఐఏఎస్ కోరారు.
“నాణ్యమైన విత్తనం – అధిక దిగుబడికి పునాది” అనే లక్ష్యంతో రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
