సూర్యాపేట:కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ ) కార్యక్రమం పేరుతో కోట్లాది మంది పేదలు, వలస కార్మికులు, గిరిజనులు, దళితులు, మైనారిటీలు మరియు అట్టడుగు వర్గాల ఓటు హక్కులు ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల జాబితాల్లో పేర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలు పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు.ప్రస్తుతం అమలు చేస్తున్న సర్ విధానం అనేక సందేహాలకు తావిస్తోందని అన్నారు.దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య శక్తులు ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు.
ఓటరు జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలనిసూచించారు.ప్రతి ఓటరికి తగిన సమాచారం అందించి, అభ్యంతరాలు తెలిపేందుకు తగినసమయంఇవ్వాలన్నారు. ప్రజల ఓటు హక్కును హరించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్ట రాదన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత ప్రాథమిక రాజ్యాంగ హక్కు అని గుర్తు చేశారు. అందువల్ల ఎన్నికల సంఘం రాజకీయ పక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ప్రజల్లో అనుమానాలకు తావులేకుండా సర్ ప్రక్రియను నిర్వహించాలని కోరారు.ఎన్నికల జాబితాల సవరణ పేరుతో ప్రజాస్వామ్య హక్కులపై దాడి జరిగితే సిపిఎం తీవ్రంగా ప్రతిఘటిస్తుందని అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
