కాకినాడ, జూలై 04 : మహిళలు పారిశ్రామిక వేత్తలుగా పరిణామం చెందండి అని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేసారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కాకినాడ ఆశ్రమంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్జానా ఆలీషా పేపర్ ప్లేట్స్ మేకింగ్ యూనిట్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి అమృత హస్తములతో ఆవిష్కరించగా, జె.ఎన్.టి.యు.కె ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మరాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మహిళా సమన్వయకర్త పేరూరి కోమలి కార్యక్రమ విశిష్టతను వివరించి, ఈ కార్యక్రమం మహిళా ఆర్ధిక సాధికారతకు దారి తీస్తుందని అన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ ఒక గృహంలో మహిళ అభివృద్ధి సాధిస్తే, కుటుంబ సభ్యులందరూ ఉన్నతిని సాధస్తారని అన్నారు. మహిళలు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్ధిక సాధికారత సాధించాలని అన్నారు. గిరిజన మహిళల కోసం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా చీమలవారి గూడెంలో ఎన్నెన్నో మహిళాభివృద్ధి కార్యక్రమాలు కట్టా లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. మహిళలు కాలాన్ని సద్వినియోగం చేసుకుని మహిళా పారిశ్రామిక వేత్తలుగా, ఒక రోల్ మోడల్ గా పరిణామం చెందాలని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. ప్రతీ మహిళా మూడు మొక్కలు నాటి, ఎల్నినో వంటి వర్షాభావ పరిస్థితులను అదిగమించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యవర్గ సభ్యులు మండా యెల్ల మాంబ, కాకినాడ లక్ష్మి, చిర్ల లలిత, దాట్ల శ్రీదేవి మరియు 9 మంది ఆశ్రమ కమిటీ సభ్యులు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు పేరూరి సూరిబాబు, ఏ.వి.వి.సత్యనారాయణ, చిర్ల వెంకట రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
