: డిసెంబర్ 1 న హైదరాబాద్లో జరగనున్న మాలల సింహ గర్జన సభను విజయవంతం చేయాలని తెలంగాణ మాల మహానాడు దౌల్తాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్, రాయపోల్ మండల నాయకులు దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండలం ఆరెపల్లి, దౌల్తాబాద్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాలల గుర్తింపు కోసమే జాతిని ఏకం చేస్తున్నామని మాలల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారు. ఇకనైనా మాలలు ముసుగు వేసుకుని ఇంట్లో కూర్చోకుండా బయటికి రావాలని పిలుపునిచ్చారు.అన్నీ కులాల వారు సమావేశాలు నిర్వహించుకుంటారని అలాంటప్పుడు మాలలు సమావేశం జరుపుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మేము వేరే కులాల గురించి మాట్లాడట్లేమని మా ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు దోచుకుంటున్నారని,ప్రభుత్వ ఉద్యోగాల్లో పోస్ట్లు వారికే వస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.సుప్రీంకోర్టు తీర్పు మాలలకే కాదు మాదిగలు, ఎస్టీలకు కూడా వ్యరేతికంగా ఉందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు కుల వివక్ష లేదనే భావన కలిగించేలా ఉందని పేర్కొన్నారు. కుల వివక్ష, ఆర్థిక వెనుకబాటు ఒక్కటి కాదని రాజ్యాంగంలో అంబేద్కర్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. మేం ఎవరికీ వ్యతిరేకం కాదని,రాజ్యాంగాన్ని కాపాడాలనే మా పోరాటమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కుల వివక్ష లేదని ఏ ఒక్కరైనా చెప్పగలరా అని ప్రశ్నించారు.ఎస్సీ, ఎస్టీల్లో కుట్రలు ఉన్నాయి.అలాంటి కుట్రలు మాలల్లో ఉండొద్దు అనేది మా లక్ష్యమన్నారు.జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఎక్కడ లేదని, దళితుల్లో విభజన తెచ్చే ప్రయత్నాలు చేయొద్దని కోరారు. మా మాల జాతి ఐక్యత కోసమే 2024, డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాలల సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు సంఘం నాయకులు ఇంద్రాల పరశురాం, లక్ష్మణ్, నరేష్, సత్యం, చక్రి తదితరులు పాల్గొన్నారు.