పిఠాపురం, ఫిబ్రవరి 10 : ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని ఆధ్యాత్మిక తత్వం మనసుకు దశ దిశ నిర్దేశిస్తుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 98వ వార్షిక జ్ఞాన మహా సభల్లో భాగంగా రెండవరోజు మంగళవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు. మానవునిలోని కలి కల్మష్మాలను, జడ కాలుష్యాలను తొలగించి అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని వెలికితీయడమే పీఠం తత్వమని తెలిపారు. ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించడం ద్వారా మానవుడు తన జీవనయానంలో ఎదురుయ్యే అశాంతి, ఆందోళన, వత్తిడి వంటి వాటినుండి విముక్తి పొందవచ్చునని అన్నారు. మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వరత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తాత్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తత్వం, తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గంవైపు మరల్చుకోవచ్చునని అన్నారు. అరిషడ్వర్గాలను స్థాయిపర చుకుంటే అది సాధ్యమౌతుందని తెలి పారు. పీఠం అందిస్తున్న ధ్యాన, జ్ఞాన, మంత్ర, సాధనలతో కూడిన త్రయి సాధన అవలంబించడం ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావనలు నియంత్రించ బడతాయని అన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులను నిర్లక్ష్యం చేస్తూ పీఠాలను, ఆలయాలను గురువులను సందర్శించినా ముక్తిని పొందలేరని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తల్లితండ్రులను దైవాలుగా భావించి గౌరవించాలని సూచించారు.
ఆధ్యాత్మిక ప్రభోదం, సామాజిక సేవలను రెండు నేత్రాలుగా చేసుకుని ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు. అనంతరం పీఠం రూపొందించిన పరతత్వకీర్తనల గ్రంధం, పీఠం తెలుగు, ఇంగ్లీష్, హిందీ బ్రోచర్ లను అతిధుల సమక్షంలో పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు. తదుపరి మురమళ్లకు చెందిన బాణాల సిద్ధాంతి పీఠాధిపతిని
గజమాలతో ఘనంగా సత్కరించారు. సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఎమ్మెల్సి పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్సి, కిమ్స్ మెడికల్ కాలేజ్ చైర్మన్ చైతన్య రాజు, ప్రముఖ సిద్ధాంతి గరిమెళ్ల వెంకటరమణ, గిడుగు రామూర్తి మనుమరాలు గిడుగు క్రాంతి కృష్ణలు మాట్లాడుతూ ప్రకాశవంతమైన జ్ఞానమే గురువు అని తెలిపారు. సద్గురువు వలన ధర్మం కాపాడబడుతుందని అన్నారు. కష్ఠాలు తీర్చమని కాదు కష్ఠాలను ఎదుర్కునే శక్తినివ్వమని శిష్యులు గురువుని కోరుకోవాలని వెల్లడించారు. భగవంతుడికి దగ్గర కావడానికి అద్భుతమైన అవకాశం మానవజన్మ అని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తత్వ ప్రబోధం ద్వారా ప్రతివ్యక్తిలోనూ మానవత్వపు విలువలను పెంపొందించడానికి నిరంతరం పాటుపడు పడుతున్న పీఠాన్ని సందర్శించడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠం అందిస్తున్న సేవలను ప్రశంసించారు.
ప్రతిఒక్కరూ కుటుంబానికి విలువ ఇచ్చినట్లుగానే సమాజానికి కూడా విలువ ఇవ్వాలని అన్నారు. గురుముఖంగా ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానాన్ని పొంది తరించాలని తెలిపారు. సభలో పాల్గొన్న సామాన్యులను సైతం అసామాన్యులను చేసే మహోన్నత పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని వెల్లడించారు. గీతావధాని యర్రంశెట్టి ఉమామహే శ్వరరావు, కె.సూర్యలత, ఎన్.టి.వి.ప్రసాదవర్మ, కృష్ణ, జి.రమణ, పి.మంజుల తదితరులు సభలో ప్రసంగిస్తూ గురు శిష్యుల సంబంధం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని తెలిపారు. నమ్మిన గురువుతో పరిపూర్ణమైన ప్రయాణం చేస్తే శిష్యుని జీవితం సార్ధకమౌతుందని వెల్లడించారు. అత్యంత ప్రాచీనమైన సనాతన పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సభ్యులు కావడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత భవానీ దీక్షా పీఠం వ్యవస్థాపకులు శివరామకృష్ణ స్వామీజీ, గీతా పారాయణం నిర్వాహకులు అడపా సీతాపతి, పరవస్తు పద్య పీఠం స్థాపకులు ఫణిశయనసూరి, యోగా గురువు కరిబండి రామకృష్ణ, పశ్చిమగోదావరి జిల్లా జిల్లా లయన్స్ గవర్నర్, కైండ్ నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టెం మాణిక్యాలరావు, కళారత్న, అఖండ శంఖారావ యువగళం కొండా నరసింహారావు, పిఠాపురం సీఐ శ్రీనివాస్, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ చైర్మన్ పిల్లి తిరుపతిరావు, తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. సభలో నిర్వహించిన సంగీతవిభావరిలో ఎ.ఉమ బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాలనుండి విచ్చేసిన వేలాదిమంది సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా 234 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు, ఎవివి. సత్యనారాయణ, ఎన్టీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద కుమార్, స్వర్ణలత, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
