కాకినాడ : జ్యోతిర్లింగాలు దైవిక శక్తికి మూలాధారాలని మహాశివరాత్రి రోజున దీపజ్యోతులతో ఆరాధన చేయడం మహాదేవుని వైభవంగా ఆచరించే సంప్రదాయమని నగర గణేశ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షు డు, సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ ఆర్టిసి కాంప్లెక్స్ రైతు బజార్ వెనుక వున్న బర్మా కాందిశీకుల కాలనీలో గణపతి మందిరం వద్ద ఆలయ పునఃనిర్మాణ కమిటీ మహా శివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి జ్యోతిర్లింగార్చన నిర్వహించింది. కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న రమణరాజు కలశ పూజ నిర్వహించి శివతత్వ మహిమ, శైవపురాణ విశేషాలను తెలియజేసారు. కోలా ఎల్లారావు పర్యవేక్షణలో స్థానిక గృహిణులు పాల్గొని దీపాలు వెలిగించి హరహర మహాదేవ నామస్మరణ చేసారు. కోలాఎల్లా రావు దంపతులు వెంకటలక్ష్మి, సుగ్గుకృష్ణ, ఇళ్ల బాపూజీ, సత్యనారాయణ, కన్నీడి వరప్రసాద్, బీర చిన్నరాజు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
