పిఠాపురం : సంఘసంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, సమాజంలో మూఢాచారాలు, మూడవిశ్వాసాలు పై పోరాడిన సామాజిక విప్లవకారుడు, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్, యువ సాహితీవేత్త డాక్టర్ కిలారి గౌరీ నాయుడు కొనియాడారు. కందుకూరి వీరేశలింగం జయంతి కార్యక్రమం సమైక్య భారతి ఆధ్వర్యంలో కాకినాడ పట్టణం దంటు కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్నారు. ముందుగా కందుకూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మహిళాభ్యుదయం విద్యతోనే ముడిపడి ఉన్నదని నమ్మి మహిళా విద్యను ప్రోత్సహించుటకు మొట్టమొదటి మహిళా విద్యాసంస్థల ఆంధ్రప్రదేశ్ లో స్థాపించిన ఘనత కందుకూరి వీరేశలింగంకు దక్కిందని గౌరీ నాయుడు తెలిపారు. నాటక రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు నాటకరంగ దినోత్సవం గా ప్రకటించడం జరిగిందని గౌరీ నాయుడు పేర్కొన్నారు. సమాజంలో ఉన్న రుగ్మతులను, దురాచారాలను రూపుమాపేందుకు శారీరక, మానసిక దాడులకు భయపడకుండా ముందుకు సాగిన ధైర్యశాలి కందుకూరి అని పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల పూర్వ అధ్యాపకుడు అప్పలరాజు అన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించిన గొప్ప మానవతావాది కందుకూరి అని, అవినీతి అధికారుల లోపాలను ఎత్తి చూపటానికి పత్రికలను సాధనంగా వాడుకున్నారని సమైక్య భారతి గోదావరి జిల్లాల అధ్యక్షుడు కోరు ప్రోలుగౌరీ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాల కార్యవర్గ సభ్యులు, కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
