సూర్యాపేట: చత్తీస్ గడ్ ఎన్కౌంటర్ లో మృతిచెందిన27 మంది మావోయిస్టుల మృత దేహాలను కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అప్పగించాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ చత్తీస్ఘడ్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 27మందిని ఎన్కౌంటర్ చేయడాన్ని వామపక్ష, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
చర్చలకు తాము సిద్దమేనని మావోయిస్టులు పదేపదే చేసిన విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం, చత్తీస్ఘడ్ రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి అమానవీయంగా మావోయిస్టులను తుడిచిపెట్టే విధానాన్ని అనుసరిస్తున్నాయని విమర్శించారు. పైగా ప్రధాని, హోంమంత్రి ప్రకటనలు ఎన్కౌంటర్పై హర్షం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
అనేక రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలు మావోయిస్టులతో చర్చలు జరిపే విషయాన్ని పరిశీలించాలని పలు విజ్ఞప్తులు చేశాయన్నారు. మావోయిస్టు రాజకీయలతో భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ వారితో వెంటనే చర్చలు జరపాలని, పారామిలటరీ దాడులను ఆపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చత్తీస్ గడ్ లో జరిగిన ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సెట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలని కోరారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలన్నారు. అటవీ సంపద, ఖనిజాలు, వనరులు, భూమిని అంబానీ, హదాని వంటి కార్పోరేట్ సంస్థల అధిపతులకు అప్పగించడం కోసమే ఆపరేషన్ చేపట్టిందని విమర్శించారు. శాంతి భద్రతల సమస్యగా సృష్టించి బూటకపు ఎన్కౌంటర్ లు చేస్తున్నారని అన్నారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృత సమస్యగా పరిగణించి చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. శాంతి భద్రతల సమస్యగా చూడడం సరైనది కాదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ప్రజలంతా ఉద్యమించాలని అన్నారు. మావోయిస్టులపై దాడుల పేరుతో ఆదివాసులను చంపుతున్నారని విమర్శించారు. డోన్ కెమెరాలతో వెతికి మరి చంపడం సమంజసం కాదన్నారు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాల కాల రాయడంలోనే భాగంగా బూటకపు ఎన్కౌంటర్ లు చేస్తుందన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు చేపట్టాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ ఎల్.భద్రయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు,సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కునుకుంట్ల సైదులు, సామాజిక అధ్యయన వేదిక కో కన్వీనర్ రేపాక లింగయ్య, బహుజన మహాసభ రాష్ట్ర కమిటీ సభ్యులు నారా బోయిన వెంకట్ యాదవ్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, డిటిఎఫ్ జిల్లా నాయకులు యోగానంద చారి, నాయకులు మందడి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.