Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రావణ మాస కానుక

  • 14 వేల మంది మహిళలకు చీర, పసుపు కుంకుమలు

 

  • పిఠాపురం శ్రీ పాదగయ క్షేత్రంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు

 

  • భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొన్న మహిళలు

 

  • శక్తి రూపిణి శ్రీ పురుహుతిక అమ్మవారి సన్నిధిలో సందడి

 

  • ఐదు బృందాలుగా వ్రతమాచరించిన పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులు

 

  • తొలి పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ

 

పిఠాపురం : పిఠాపురంలోని ప్రముఖ శక్తి పీఠం శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణం శ్రావణ మాసం చివరి శుక్రవారం వరలక్ష్మి దేవి వ్రత పూజలతో సందడిగా మారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం శాసనసభ్యుడు కొణిదల పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఆడపడుచులకు శ్రావణ మాస కానుకగా చీర, పసుపు కుంకుమలు పంపించారు. 14 వేల మందికి శ్రావణ మాస కానుకలు ఆలయ ప్రాంగణంలో ఇచ్చారు. తొలుత 10 వేల మందికి శ్రావణ మాస కానుకలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే భక్తురాళ్ళు ఎక్కువ మంది హాజరవుతారని సమాచారం ఉండటంతో మరో నాలుగు వేల మందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తంగా ఈ యేడాది 14 వేల మందికి శ్రావణ మాస కానుకను అందించగలిగారు. అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అమ్మవార్ల పేర్లతో ఐదు భక్త బృందాలుగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆడపడుచులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి పూజల్లో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ పాల్గొని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. పవన్ కళ్యాణ్ పంపిన చీరలను కానుకగా ఆడపడుచులకు అందజేశారు. ప్రతి బృందంలో 1500 మందికిపైగా మహిళలు వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు. పూజలో పాల్గొన్న ఆడపడుచులకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూజా సామగ్రిని ఉచితంగా సమకూర్చారు.

 

  • శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం

 

వరలక్ష్మీ వ్రతం ఆచరణ కోసం వేకువజాము నుంచి వేలాది మంది మహిళలు శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురూహూతిక అమ్మవారి దివ్య క్షేత్రానికి తరలివచ్చారు. వేద పండితులు, ఆలయ వంశపారపర్య అర్చకులు మహిళలతో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వత్రాన్ని చేయించారు. ముందుగా వరలక్ష్మి దేవిని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కొలువు దీర్చారు. అనంతరం గణపతి పూజ, కలశారాధన, అమ్మవారి అష్టోత్తర శతనామావళి, వరలక్ష్మీ స్తోత్రాలు, షోడషోపచార పూజలు ఆచరింపజేశారు. అనంతరం పండితులు వరలక్ష్మీదేవి వ్రతకథను చదివి వినిపించారు. ఐదు విడతలుగా నిర్వహించిన ఈ సామూహిక వరలక్ష్మి శ్రావణ శుక్రవార వ్రతాలకు నియోజకవర్గ నలుమూలల నుంచి వేలాది మంది మహిళలు హాజరయ్యారు. జనసిన పార్టీ వాలంటీర్లు, పోలీసులు, ఆలయ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ఆలయ ప్రాంగణంలో మెడికల్ సెంటర్ ఏర్పాటు చేశారు.

 

  • పసుపు, కుంకుమ, చీరల పంపిణీ

 

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో వేద పండితులు ఐదు విడతలుగా మహిళలతో వ్రతమాచరింపజేశారు. ఉదయం 5 గంటలకు అంబిక అమ్మవారి పేరు మీద తొలి విడత వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం 6.30 గంటలకు భ్రమరాంబ అమ్మవారి పేరు మీద, 8 గంటలకు చాముండి అమ్మవారి పేరు మీద మూడో విడత, 9.30 గంటలకు దుర్గ అమ్మవారి పేరు మీద నాలుగో విడత, 11 గంటలకు ఈశ్వరి అమ్మవారి పేరు మీద చివరి విడతగా మహిళలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపజేశారు. ఏటా జరిగే విధంగానే సంప్రదాయాన్ని గౌరవిస్తూ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించిన ఆడపడుచులకు పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పసుపు, కుంకుమ, చీరలను కానుకగా పంపించారు. ఈ కానుకలను అందించే కార్యక్రమ ఏర్పాట్లను గత రెండు రోజులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) పర్యవేక్షించారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త మార్రెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు, జన సైనికులు, వీర మహిళ నేతలు, పార్టీ వాలంటీర్ విభాగం సభ్యులు సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, బీజెపీ నాయకులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉత్తమ ఉపాధ్యాయుడిగా దాకే అప్పలరాజు

Dr Suneelkumar Yandra

వాయుగుండం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

TNR NEWS

బెట్టింగ్ మాఫియా డొంక లాగుతున్న పోలీసులు! నిర్వహుకులే అసలైన టార్గెట్..?

Dr Suneelkumar Yandra

నాపై కేసులన్నీ ఆరోపణలే – మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Dr Suneelkumar Yandra

విజయవంతంగా ముగిసిన పిఠాపురం మండల గ్రామముల ఆవిర్భావ సభ సన్నాహక సమావేశములు

Dr Suneelkumar Yandra

మృగశిర కార్తె సందర్భంగా పశ్చిమ గోదావరిలో ఆక్వా విందు

TNR NEWS