హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులను రాజకీయాలకు అతీతంగా గుర్తిస్తామని అందుకోసం ఏర్పాటైన కమిటీ స్పష్టం చేసింది. మంగళవారం తెలంగాణ అమరవీరుల స్మారక అమరజ్యోతిని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సందర్శించింది. ఈ కమిటీ చైర్మన్ కె. కేశవరావు నేతృత్వంలో ఈ అమరజ్యోతి వేదికగా సమావేశమైంది. జూన్ 23వ తేదీ నుంచి ఉద్యమకారుల గుర్తింపుపై దశలవారీగా సంప్రదింపులు జరుపుతామని కమిటీ వెల్లడించింది. అందుకోసం విద్యార్థి జేఏసీ, కళాకారులు, రచయితలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపింది.
అలాగే ప్రజా సంఘాలు, అడ్వకేట్లు, డాక్టర్ల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని కమిటీ పేర్కొంది. 2001-2014 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారితో చర్చలు జరుపుతామని వివరించింది. ఈ ఉద్యమకారుల గుర్తింపుపై విస్తృత స్థాయిలో సూచనల సేకరిస్తామంది. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో అభిప్రాయాల స్వీకరణ జరపనున్నట్లు పేర్కొంది. ఉద్యమకారుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కమిటీ ప్రకటించింది.
ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టనున్నట్లు తెలిపింది. తెలంగాణ ఉద్యమ చరిత్రకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించింది. ఈ కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
