తెలంగాణ రైతులకు శుభవార్త. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గత కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ వరకు విస్తరించి నిలిచిపోయిన రుతుపవనాలు ప్రస్తుతం వేగంగా ముందుకు కదులుతూ నిజామాబాద్ వరకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మంగళవారం నాటికి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రుతుపవనాల ప్రభావంతో రాబోయే ఐదు నుంచి ఆరు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. వర్షాల కారణంగా ఎండల తీవ్రత తగ్గి రైతులకు ఉపశమనం లభించనుంది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనులకు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Save or share this story as a newspaper-style Epaper Clip:
