సూర్యాపేట: భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమ హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముదాం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
సూర్యాపేటలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలని, సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించకుండా సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను వెంటనే పరిష్కరించాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ అమలు చేయాలని, కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు అందించాలని, ఇళ్లు లేని భవన నిర్మాణ కార్మికులకు ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టనున్న జూలై 20న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా, ఆగస్టు 4న యువ కార్మికుల రాష్ట్ర సదస్సు, ఆగస్టు 10న జైల్ భరో, సెప్టెంబర్ 7న చలో హైదరాబాద్ కార్యక్రమాలను సూర్యాపేట జిల్లాలో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జిల్లాలో 2026 సంవత్సర సభ్యత్వాన్ని పూర్తి చేయాలని, సభ్యత్వం ఉన్న ప్రతి గ్రామంలో సంఘ కమిటీలను నిర్మించాలని, యువత మరియు మహిళా భవన నిర్మాణ కార్మికులను సంఘటితం చేయాలని సూచించారు. మండల స్థాయిలో రాజకీయ, సంఘ నిర్మాణ శిక్షణ తరగతులు నిర్వహించి కార్యకర్తలను ఉద్యమాలకు సిద్ధం చేయాలని అన్నారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విస్తృత ప్రచారం నిర్వహించి, కార్మికులను ఐక్యం చేసి పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ముదాం శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు సంఘం జిల్లా అధ్యక్షులు అనంతల మల్లయ్య ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ జిల్లా కోశాధికారి కొత్తపల్లి శివకృష్ణ ఉపాధ్యక్షులు లకావత్ బాలాజీ నాయక్ జిల్లా కమిటీ సభ్యులు నార్ల రంగయ్య ధనావత్ నెహ్రూ వంగాల శేఖర్ సిహెచ్ నాగరాజు గుంజ రవీందర్ మాగి లింగయ్య కుంభం మధు కొత్తపల్లి కృష్ణ కోల ఆంజనేయులుమండల మండల అధ్యక్ష కార్యదర్శులు గడ్డం శివ ఒగ్గు సైదులు జి వీరబాబు మల్లెపాకు సోమయ్య షేక్ దస్తగిరి నందిపాటి నరహరి ఏడుకొండలు షేక్ నసిరుద్దీన్ సుదర్శన్ కత్తి అంజయ్య వీరబాబు మహిళా మండల కన్వీనర్లు జాజుల సావిత్రి మంజుల కృష్ణవేణి తదితర ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
