వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు భావితరాలకు నీటి వనరులను భద్రపరచవచ్చని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి లు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘వర్షాన్ని పట్టుకోండి’ ప్రచార కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వర్షపునీటి సంరక్షణపై సోమవారం పట్టణంలో విస్తృత అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి ర్యాలీని ప్రారంభించి ప్రజలకు వర్షపు నీటి సంరక్షణ అవసరాన్ని వివరించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ, ప్రతి ఇంటి వద్ద, ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు భవనంలో వర్షపు నీటి సేకరణ గుంతలను ఏర్పాటు చేయడం కాలానుగుణ అవసరమన్నారు. వర్షపు నీటిని వృథాగా వదిలేయకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుంటే భూగర్భ జలాలు పెరిగి, భవిష్యత్తులో తాగునీటి కొరతను అధిగమించవచ్చని తెలిపారు. ప్రతి పౌరుడు నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా భావించి వర్షపునీటి సేకరణకు సహకరించాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ కమిషనర్ హన్మంత రెడ్డి మాట్లాడుతూ, వర్షపునీటి సేకరణ గుంతలు భూగర్భ జలాలను పునరుజ్జీవింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం ద్వారా బోర్లలో నీటి మట్టాలు పెరగడంతో పాటు భవిష్యత్ తరాలకు నీటి వనరులను భద్రపరచవచ్చని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సముదాయాలు, గృహాల వద్ద వర్షపునీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రజలకు సూచించారు.అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి రవి మహల్ కన్వెన్షన్ హాల్, పి.ఎం. శ్రీ జెడ్పీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వర్షపునీటి సేకరణ గుంతలను పరిశీలించారు. వాటి నిర్మాణం, పనితీరు, ప్రయోజనాలపై ప్రజలకు వివరించారు.
ఈ అవగాహన ర్యాలీలో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డీఈ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో “ప్రతి చుక్కా విలువైనదే… వర్షం ఎక్కడ పడినా, ఎప్పుడు పడినా దాన్ని పట్టుకోండి” అనే సందేశంతో ప్రజలకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
