పిఠాపురం, ఫిబ్రవరి 09 : మానవుడు తాత్విక జ్ఞానం పొందడం వలన జ్ఞాన నేత్రం తెరువబడుతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పిఠాపురం – కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజులు పాటు జరిగే పీఠం 98వ వార్షిక జ్ఞాన మహా సభలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమర్ ఆలీషా మాట్లాడుతూ త్రయీ సాధన అనే ఆధ్యాత్మిక దిక్సూచి ద్వారా మానసిక స్థిరత్వం, ధైర్యం, అలవడి జీవన విధానం సుఖమయం చేసుకోవచ్చునని తెలిపారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే ఉద్రేకం అనే అగ్నిని సహనం అనే నీటి ద్వారా చల్లార్చాలని అన్నారు. మానవుడు తనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞాన నేత్రాన్ని గుర్తించగలిగితే తద్వారా భగవంతుడిని దర్శించవచ్చునని పేర్కొన్నారు. మానవుడిని మహనీయుడిగా మలిచే జ్ఞాననేత్రం పొందడానికి గురుముఖంగా ఆధ్యాత్మిక తాత్వాన్ని గ్రహించాలని తెలిపారు. వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక తత్వ ప్రభోదం, సామాజిక సేవలను నిర్వహిస్తూ మతసామరస్య సదస్సులతో మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న పీఠం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. అనంతరం నివేదిక 2026, ఉమర్ ఆలీషా రూరల్ డెవలెప్మెంట్ ట్రస్ట్ మరియు దేవదారు బ్రోచర్ లను పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు. రైల్వే బోర్డ్ మెంబర్ నూర్ అహ్మద్, హుస్సేన్ షా, పీఠం సభ్యులు ఎ.వి.వి.సత్యనారాయణ, రేఖా సత్యనారాయణ, ఎన్ఆర్ఐ దిడ్డి సూర్యకుమార్, ఎన్ఆర్ఐ, శ్రీధర్, డాక్టర్ ఎన్.రాంగోపాల్ వర్మ, కె.స్వర్ణలత, టి.సాయివెంకన్న బాబు, చింతపల్లి అమృతవల్లి తదితరులు ప్రసంగిస్తూ 84 లక్షల జడజన్మలకు కారణమయ్యే జలతత్వం, పృథ్వీతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశ తత్వం లను గురించి సమగ్రంగా వివరించారు. వందలాది సంవత్సరాలుగా వేదాంత విద్యను కాలానుగుణ్యంగా ఉపదేశిస్తున్న విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక యూనివర్సిటీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు. గురువుద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన వారు, మంత్రమే గురువు, గురువే మంత్రం అనే విషయాన్ని తెలుసుకోగలుగుతారని తెలిపారు. మానవసేవే మాధవ సేవ అని తెలియబరుస్తున్న మహోన్నత పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. ఈ సందర్బంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి అలియాస్ బాబు, వాసిరెడ్డి ఏసుదాస్, ప్రముఖ కవి, రచయిత యామిజాల ఆనంద్, ప్రముఖ కవి డాక్టర్ శిరీష్, సినీ మాటల రచయిత పోలగాని భాను తేజశ్రీ, యోగభారత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు, భారత్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గట్టి శ్రీకృష్ణ దేవరాయలు, ఒఎన్జిసి ఇంజనీర్ చిన్ని సత్యనారాయణమూర్తి తదితరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చిన్నారుల కొరకు పాలకేంద్రం, శిశు సంరక్షణా కేంద్రాలను,ప్రాధమిక వైద్య శిబిరాలతో పాటుగా 36 కేంద్రాలను ఏర్పాటు చేసారు. పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాల వికాస్ నందు శిక్షణ పొందుతున్న చిన్నారులు మాస్టర్ రేఖా ఉషా కిరణ్ బ్రదర్స్ ఉపన్యాసం సభికులను ఆకట్టుకుంది. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఎ.ఉమ బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచేసాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాలనుండి విచ్చేసిన వేలాది మంది సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా 351 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు, ఎన్టీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
previous post
