హుజూర్ నగర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా కానిస్టేబుళ్లకు పోక్సో (పిల్లలపై లైంగిక నేరాల నిరోధక) చట్టంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, ఎస్సై చలికంటి నరేష్ పాల్గొని మహిళా పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ చరమంద రాజు మాట్లాడుతూ మైనర్ బాలికల రక్షణలో మహిళా పోలీసు సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పోక్సో చట్టంలోని నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని క్షేత్రస్థాయిలో బాలికలకు చట్టాలపై చైతన్యం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో ‘పోలీస్ భరోసా’ కార్యక్రమాల ద్వారా విద్యార్థినులకు భద్రత, సైబర్ నేరాల నివారణ, ఆపద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓర్పుతో విని తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. జనరల్ డైరీ నిర్వహణ, ఫిర్యాదుల నమోదు, చట్టపరమైన విధానాలపై కూడా మహిళా కానిస్టేబుళ్లకు అవగాహన కల్పించారు. ప్రజలతో మమేకమై బాధ్యతాయుతంగా పనిచేస్తూ పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెంచే విధంగా సేవలు అందించాలని సీఐ కోరారు. కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
