నేరేడుచర్ల మండలం నర్సయ్యగూడెం గ్రామ ప్రభుత్వ పాఠశాల భవనం అందుబాటులో ఉన్నప్పటికీ, సరైన దారి లేకపోవడం వల్ల విద్యార్థులకు ఉపయోగపడకుండా ఉండటం స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పాఠశాల భవనం నిర్మాణం పూర్తై చాలా కాలమైనప్పటికీ దారి సమస్య పరిష్కారంలో అధికారులు ఇప్పటికీ విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించడం లేదని, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బడిబాట’ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం గ్రామంలోని ప్రభుత్వ బడిని వినియోగంలోకి తీసుకురావడంలో ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నిస్తున్నారు. పాఠశాల స్థలానికి హద్దులు నిర్ణయించి ప్రహరీ గోడ నిర్మించాలని, లేకపోతే భవిష్యత్తులో స్థలం ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమవుతున్నా సమస్య పరిష్కారానికి చర్యలు కనిపించకపోవడంతో ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే సమస్య పెండింగ్లో ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సమస్యను వెంటనే పరిష్కరించి పాఠశాలకు దారి కల్పించాలని, స్థానిక ప్రభుత్వ బడిని కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం త్వరలో జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు నర్సయ్యగూడెం వాసులు తెలిపారు.
