May 12, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

బీసీలను మోసం చేసే పార్టీలకు ఇక పుట్టగతులుండవని తేల్చి చెప్పే సమయం ఆసన్నమైందని తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమీషన్ సభ్యులు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ హెచ్చరించారు. బీసీలు ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాలను దక్కించుకునేందుకు చేసే బీసీ సామాజిక ఉద్యమానికి అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించి తమ చైతన్యాన్ని చాటుకోవాలన్నారు. శనివారం కోదాడలోని పెన్షనర్స్ కార్యాలయంలో ‘‘ఆలోచనాపరుల వేదిక’’ ఆధ్వర్యంలో పి.శివశంకర్ 96వ జన్మదినోత్సవం సందర్భంగా ‘‘బీసీల కోసం శివశంకర్’’ అన్న సెమినార్ లో జూలూరు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీలకు చరమగీతం పాడే చైతన్య ఉద్యమంగా బీసీ ఉద్యమం బలపడుతుందన్నారు. మేలు చేస్తే జై కొడతాం, మోసం చేస్తే తిప్పి కొడతామనే దశకు బీసీ ఉద్యమం పదునెక్కిందని తెలిపారు. ఇది కులపోరాటం కాదని బీసీల ఆత్మగౌరవ పోరాటమని చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను సంపూర్ణంగా అమలు జరిపేదాకా రాజకీయాలకు అతీతంగా బీసీలంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అడగటం కాకుండా ఆ తరహాలో కేంద్రంతో పోరాటం కూడా చేయాలన్నారు. 69 శాతం రిజర్వేషన్లు సాధించుకున్నాకే డిల్లీ నుంచి తమిళనేతలు తిరిగివచ్చారని, తెలంగాణ ప్రభుత్వం కూడా అదేవిధంగా పోరాడాలని కోరారు. బీసీ, ఎంబీసీ, సంచార జాతులకు వాళ్ళ జనాభా దామాషా పద్ధతిలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీ.పి.మండల్ కమిషన్ ను వేసింది జనతాపార్టీ అయితే దాన్ని అమలు చేసింది జనతాదళ్ ప్రధాని వి.పి.సింగ్ అని తెలిపారు. నేరం చేసినవాళ్ళే న్యాయం చేస్తున్నట్లు నటించే పార్టీల అసలు రంగును తెలుసుకుని బీసీ ఉద్యమం అడుగులు వేయవలసి ఉందని తెలియజేశారు.

బీసీల కులజాబితా తయారు చేయటానికి, బీసీలకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల కోసం రెండు దశాబ్ధాలు కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ చేసిన కృషిని సోదారహరణంగా వివరించారు. బీసీ పట్టిక తయారు చేయటానికి, బీసీ రిజర్వేషన్ల కోసం 5గురు ముఖ్యమంత్రులతో శివశంకర్ చేసిన పోరాటం అసమాన్యమైనదని పేర్కొన్నారు. ఇంద్ర సహానీ కేసు విషయంలో, మండల్ కమీషన్ అమలుకు అనుకూలంగా వచ్చిన తీర్పులో కూడా శివశంకర్ సలహాలు, సూచనలు ఉన్నాయన్నారు. బీసీల కోసం అలుపెరుగని కృషి చేసిన శివశంకర్ మరో బి.పి.మండల్ అని జూలూరు అభివర్ణించారు.

ఈ కార్యక్రమానికి పాలేటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా…ఈ కార్యక్రమంలో రాయపూడి వెంకటేశ్వరరావు, రామిశెట్టి రామకృష్ణ, పందిరి నాగిరెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, ఈదుల కృష్ణయ్య, పాలేటి రామారావు, ఆవుల రామారావు, పుప్పాల కృష్ణమూర్తి, బడుగుల సైదులు, ఉయ్యాల నరసయ్య, డి.ఎన్.స్వామి, డాక్టర్ బ్రహ్మం, బొల్లు రాంబాబు, హరి కిషన్, కస్తూరి రాములు, ముసి శ్రీనివాస్, బత్తుల ఉపేందర్, మొదలగు వారు పాల్గొన్నారు.

Related posts

ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెలు నిర్మాణం చెయ్యాలి

Harish Hs

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs

రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు డీసీపీ ఆహ్వానించిన ఆలయ చైర్మన్

TNR NEWS

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Harish Hs

మహిళా ధీరత్వానికి ప్రతీక చాకలి ఐలమ్మ

Harish Hs

దళిత గిరిజన బాధితులకు అండగా నిలవాలి

Harish Hs