పిఠాపురం , మార్చి 19 : త్రయీ సాధన అనే విశ్వ సాధన ద్వారా మానవత్వమును పరిమళింప చేసుకోమని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేసారు. గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది తెలుగు నూతన సంవత్సర మహా సభలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది మహా సభను ఆవిష్కరించారు. సభకు హాజరైన వేలాది మందికి ఉగాది పచ్చడి పంపిణీ చేయారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మజ్జిగ చలి వేంద్రాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ప్రారంభించారు. ప్రముఖ గీతావధాని యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావు పంచాంగ శ్రవణం చేసి, రాశి ఫలాలను వివరించారు. తాత్విక బాల వికాస్ ద్వారా చిన్నారులు ఉమా చంద్రశేఖర్, ఉమా శ్రీ రమ్య, యశస్వి నాగ ఉమా ప్రసంగాలు సభికులను అలరింపచేసాయి. తాత్విక యువ వికాస్ ద్వారా కుమారి కట్రెడ్డి అజీ మున్నిషా స్వానుభవం వివరిస్తూ, చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు యొక్క మహిమను సభకు వివరించారు. గిరిజన సంక్షేమ కార్యక్రమంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కట్టా లక్ష్మి మరియు లంబాడా తెగకు చెందిన గిరిజన మహిళ బనావతు బాపనమ్మ సోనీ పాడిన కీర్తన సభికులను అలరింపచేసాయి. కోయ తెగకు చెందిన కుమారి సోదేం మంగమ్మ, కాకి వెంకట లక్ష్మిలను స్వామి శాలువాలు కప్పి, మొక్కలు బహూకరించి సత్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి సేవలను స్తుతిస్తూ “మానవతా శిఖరం – ఉమర్ ఆలీషా” అని వ్రాసిన సన్మాన పత్రాన్ని స్వామి వారికి బహూకరించడం జరిగింది. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా విద్యార్థి పెదపూడి నాగబాబుకి రూ.70 వేల స్కాలర్షిప్, రాజమహేంద్రవరం ఆశ్రమానికి 50 కుర్చీల నిమిత్తం రూ.32,500ల చెక్కును, నిరుపేద మహిళకు కుట్టు మిషన్, మహిళా ఆర్ధిక సాధికారత కోసం ఇడ్లీ పాత్ర, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా బహూకరించారు. సంగీత విభావరి కార్యక్రమంలో ఉమా ముకుంద బృందం పాడిన కీర్తనలు సభికులను ఆనందింపచేశాయి. ఈ సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ తల్లి తండ్రులను గౌరవంగా చూసుకుంటూ, సమాజంలో మానవత్వపు విలువలతో నడుచుకుంటూ, గురు తత్వాన్ని ఆచరిస్తూ, సుఖం, సంతోషం, తృప్తి, మనస్సుకు శాంతిని పొందాలని అనుగ్రహ భాషణ చేసారు. సమస్యలు, కష్టాలు అదిగమించాలంటే ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానం అనే ఔషాదం ద్వారా మనో శక్తి, మనో దైర్యం పెంపొందించుకుని, భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చి దిద్దుకోమని అన్నారు. మురమళ్ళ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధంతి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామికి శాలువా కప్పి, గజమాలతో సత్కరించి, నూతన సంవత్సర పంచాంగాన్ని బహహూకరించారు. నూతనంగా మహా మంత్రం పొందాలనే ఆసక్తి కలగిన 90 మందికి స్వామి మహా మంత్రం ఉపదేశించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎ.వి.వి.సత్యనారాయణ, ఎన్టీవీ ప్రసాద్ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, కె.స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
