కాకినాడ : జిల్లా మంత్రి, డిప్యూటీ సిఎం, జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ప్రజాహిత వెతలపై స్పందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు 8అంశాల ఫ్లెక్సీతో గాంధేయ మార్గంగా నిరసన చేపట్టారు. కాకినాడలో 8గ్రామాల విలీన సమస్యలు, జిల్లా కేంద్రానికి కార్పోరేషన్ ఎన్నికలు, ఆర్థిక సంఘం నిధులు.. ముంపుకు గురవుతున్న కాకినాడ సామర్లకోట హైవే కెనాల్స్, ఉప్పుటేరు ప్రక్షాళన, అనారోగ్యకర కోనో కార్పస్ వృక్షాలు తొలగింపు, జిజిహెచ్ వికేంద్రీకరణ, ప్రసూతి విభాగంలో బెడ్స్ పెంపు, ఉప్పాడ తీరంలో రక్షణగోడ, మడఅడవుల పెంపకం సంరక్షణ, సాల్ట్ భూముల్లో విమానాశ్రయం, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఎంపి సీట్ల పెంపు, పర్యటనల్లో వ్యక్తిగతం కాని వినతిపత్రాల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాటు అంశాలను కోరారు. నిజాయితీగా ప్రశ్నించే ప్రజాస్వామ్య గొంతుకలకు జవాబులు ప్రకటించాలన్నారు. జిల్లాకు ఏకైక మంత్రిగా డిప్యూటీ సిఎంగా ప్రజాహిత వినతిపత్రాలు స్వయంగా స్వీకరించే ప్రక్రియకు పవన్ పర్యటనల్లో తగిన సమయం కేటాయించక పోవడం వలన అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి వలన ప్రజాస్వామిక వాదుల్లో తీవ్ర అసంతృప్తి వుందని పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
