- ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం
మంగళగిరి : అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో ఉచ్చులో చిక్కుకొని చిరుత బలయిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పి.సి.సి.ఎఫ్. చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు. పొన్నూటిపాళెం వద్ద ఆడ చిరుత ఉచ్చులోపడిపోయి కొన్ని గంటలపాటు పెనుగులాడి చనిపోవడం, ఆ చిరుత కడుపులో రెండు కూనలు ఉండటం, ఆ కూనలు కూడా గర్భంలో చనిపోయిన విషయాలు పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చాయి. క్షేత్ర స్థాయి నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని, శాఖాపరంగా ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించారు. ఘటన చోటు చేసుకున్న అనంతరం సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందించారనే విషయాన్నీ తెలియచేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోనూ, అటవీ ప్రాంతాన్ని సమీప గ్రామాల్లో జంతువుల కోసం ఉచ్చులు వేసే వేటగాళ్ళు, ఆ తరహా నేరాలు చేస్తున్నవారిపై నిఘా ఉంచాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పొన్నూటిపాళెం ఘటనపై విచారణను పర్యవేక్షించాలని అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావుకి దిశానిర్దేశం చేశారు.