- కొంపల్లిలో జ్ఞాన చైతన్య సభ
హైదరాబాద్, ఫిబ్రవరి 01 : శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి 60వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ పీఠం సభ్యులు కొంపల్లిలోని కండ్లకొయ్య గ్రామంలోని హనుమాన్ ఆలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారికి పీఠం సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత స్వామి వారికి కోలాటంతో స్వాగతం పలికి, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతించి, పూలతో ఏర్పాటు చేసిన మార్గంలో స్వామిని సభ వద్దకు ఆహ్వానించారు. అనంతరం హనుమాన్ ఆలయ అర్చకులు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈశ్వర లింగానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారితో ప్రత్యేక అభిషేకం చేయించి, పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదాలు అందించారు. వేదికనలంకరించిన ఉమర్ ఆలీషా స్వామి పూర్వ పీఠాధిపతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. తదుపరి ఏర్పాటు చేసిన జన్మదిన కేకును స్వామి కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు. కొంపల్లి పీఠం సభ్యులు పీఠంతో ఉన్న తమ తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ జ్ఞాన చైతన్య సభకు సూర్యలత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సష్టమ పీఠాధిపతి రచించిన గీతం పీఠం సభ్యురాలు సన్నిబోయిన వరలక్ష్మి ఆలపించి సభికులను అలరింపజేసింది. పీఠం సభ్యుడు ఎస్.చిన్నబ్బాయి మాట్లాడుతూ గురుశిష్యుల అనుబంధం గురించి సభకు తెలియజేశారు. పీఠం సభ్యుడు గుర్రాల వెంకటేష్ మాట్లాడుతూ స్వామి వారికి సేవ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి గురువారం ఆరాధన చేస్తూ ఉంటామని తెలిపారు. తాత్విక బాలవికాస్ చిన్నారి ప్రణీత్ గురుశిష్యుల ప్రేమతత్వం గురించి ముద్దు ముద్దుగా మాట్లాడిన మాటలు అందరినీ మంత్రముగ్దులను చేశాయి. చిన్నారి వర్షిణి పాడిన పాట అద్భుతంగా ఉందని అందరూ ప్రశంసించారు. తాత్విక బాలవికాస్ చిన్నారి భక్తుడు ఎలా ఉండాలి అని చెప్పిన విషయం పెద్దలను ఆలోచింపచేసింది. చిన్నారి మోక్ష చేసిన నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది. తాత్విక బాలవికాస్ చిన్నారులు ప్రదర్శించిన దృశ్యరూప నాటకం చూపరులను ఆకర్షించింది. పీఠం ఆస్థాన అవధాని యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ జ్ఞాన తత్వం ద్వారా స్వామి ఆశీస్సులు పొందవచ్చని తెలిపారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారి 60వ జన్మదినోత్సవం సందర్భంగా స్వామి వారి గురించి ప్రసంగించారు. పీఠం సభ్యులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి తాత్విక బాలవికాస్ చిన్నారులకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం చిన్నారులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను అందజేశారు. నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా జన్మదినం సందర్భంగా 60 సంవత్సరాల ఆయన జీవిత పయనంపై నిర్మించిన లఘుచిత్రాన్ని సభలో ప్రదర్శించారు. అనంతరం స్వామి వారికి భక్తులు పుష్ప గుచ్చాలను, పూల మొక్కలను, బహుమతులను అందజేశారు. భక్తులు ఉమర్ ఆలీషా స్వామి వారికి అందజేసిన సన్మాన పత్రాన్ని అవధాని యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావు చదివి వినిపించారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి వారు మాట్లాడుతూ భక్తులకు స్వామి వారి యొక్క 60 సంవత్సరాల జీవిత కాలంలో జరిగిన పలు సంఘటనలు, విశేషాలు, అగాథాలను పంచుకున్నారు. స్వామి చేతుల మీదుగా హారతి ఇచ్చారు. భక్తులందరూ స్వామి వారి ఆశీస్సులు పొడి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం, నాగులపల్లి, ఉప్పరగూడెం, ఇసుకపల్లి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ సభ్యులు భోజన కార్యక్రమం నిర్వహించారు.
