సైన్స్ పై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని,సమాజంలో మూఢ విశ్వాసాలను పోగొట్టి శాస్త్రీయ ఆలోచనలు కల్పించేందుకు సైన్స్ దోహదపడుతుందని మునగాల మండల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సైదయ్య గౌడ్ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఆదర్శ పాఠశాలలో సీవీ రామన్ జన్మదిన సందర్భంగా సైన్స్ డే ను ఘనంగా నిర్వహించారు. సైన్స్ డే సందర్భంగా పాఠశాలలో విద్యార్థులచే సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సైదయ్య గౌడ్ మాట్లాడుతూ.. సైన్స్ డే ను పురస్కరించుకొని పాఠశాలలు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించమని తెలిపారు.సమాజానికి మేలు చేసే వస్తువులను, విషయాలను కనుగొనేందుకు తమ జీవితాలను ధారపోసిన శాస్త్రవేత్తలను ప్రతీ విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
