కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ అమెన్మెంట్ యాక్ట్ బిల్లును ఉపసంహరించుకోవాలని మౌలానా అబ్దుల్ ఖాదీర్ రషాది,ముఫ్తీ అతార్ మౌలానా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని అన్ని మసీదుల్లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు చేతులకు నల్ల రిబ్బన్ పట్టిలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ప్రార్థనలు చేశారు. అనంతరం పట్టణ ప్రధాన రహదారి పై వందలాది మంది ముస్లింలు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ముస్లింలపై కక్ష సాధింపు చర్యతో లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇటువంటి మతోన్మాద చర్యలు చేపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న లౌకికవాద వ్యతిరేక చర్యలు అన్నింటిని లౌకిక వాదులు ఖండించాలన్నారు. ప్రభుత్వం బిల్లు ను ఉపసంహరించుకోకపోతే యావత్ భారతదేశం ముస్లిం సోదరులంతా ఉద్యమిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు నయీమ్ భాయ్, మహిమూద్, మజాహార్, మహమ్మద్ సాబ్, మునీర్, అలీ బాయ్, అబ్బు, ఆసిఫ్, అల్తాఫ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు………
